"అనగనగా ఒక రాజు" అంటూ మొదలుపెట్టగానే ,
ఇదేదో రాజుల కధ అనుకుంటే,మీ ఊహకి రేక్కలోచ్చినట్టేనండోయ్ !
మరి ఆ రాజేవరంటారా....
మా కళల కొలువుకి నెలరాజు,
దివ్య జ్ఞానోపాసనకి రారాజు,
నిత్య యవ్వనానికి యువరాజు,
మా నాట్య కళాక్షేత్రానికి మహా రాజు,
శ్రీ శ్రీ శ్రీ......కృష్ణకుమారులవారు (నిజంగానే కృష్ణుని కుమారుడిలాంటివారండోయ్)
ఆ కళా "క్షేత్రం"లో ఉమా, ప్రీతి, పద్మిని, వాత్సవి, నాగలక్ష్మి, గౌతం అనే బీజాలను నాటి,
ఉపాసననే నీరుగా పోసి,మొక్కలుగా పెంచి,వృక్షాలుగా మలిచారు.
మరి ఆ వృక్షాలు ఎలా ఉన్నాయో..
ఓ సారి అలా ఆ అల్లరి బృందావనం లోకి వెళ్ళి చూసొద్దాం రండి.
ఉమ :-
పేరుకు పార్వతిలా ఉన్నా , నైజం మాత్రం కాళికదే.
నాట్యమంటే ప్రాణం.(ఎంతైనా నటేశుని భార్య కదా!)
ఏ చలనమూ లేని నిశ్చల జీవతం ఆమెది.
కానీ, తనవారితో ఏర్పరుచుకున్న ఓ చిన్ని ప్రపంచానికి
మహారాణిగా వెలుగొందుతోంది.
కళ్ళతో చూసినవారికి కఠిన శిలగానూ ,మనసుతో మాట్లాడిన వారికీ
ఓ జలపాతంలా,ఓ నిండు వెన్నెలలా ,ఓ మౌనరాగంలా కనిపిస్తుంది.
మరి తన ప్రపంచంలోకి వెళితే...........
ఓ ప్రభంజనం....ఓ ఉద్వేగం.....ఓ కళా ......ఓ కావ్యం
కలగలిసి, ఒకింత అల్లరి మరింత వెల్లువగా మారి ,
ఆనందాల అలల అలజడితో తీరాన ఉన్నవారిని తడిపేస్తుంది.
నాటోపాసనలో సృజనాత్మకతతో కూడి,
ప్రతీక్షణం ఓ కొత్తదనం కోసం పరితపిస్తూ,
తక్షణమే తన ప్రతిభను కనబరుస్తూ,
ఆ కళారూపాల్ని ఓ కొత్తకోణంలో నాత్యీకరిస్తుంది.
ప్రతిరోజూ ఆకొత్తదనంలోని ఆనందాలను ఆస్వాదించాలని
పరితపిస్తూ నిదురిస్తుంది.
ఆమెని ఓ వీరవనితగా చెప్పవచ్చు.
రౌద్రమావహించినవేళ,ఆమెలో విలయతాండవాన్ని చూడవచ్చు.
ప్రీతి :-
రామాయణం అంతా విని, రాముడికి సీత ఏమౌతుంది?
అని అడిగితేనే మీకు విపరీతమైన కోపం వస్తుంది.
మరి ఈమె, రామాయణం అంతా పక్కనే ఉండి విని,
"చివరిది మాత్రమే విన్నాను.మళ్ళీ మొదట్నుండీ చెప్పరా.."
అంటూ వేల సార్లు అడిగింది.
ఇప్పుడు మా పరిస్తితి ఏమిటంటారూ ?
ఇది ఆమెలో మాత్రమే ఉన్న ఓ కొత్తకోణంగా భావించి,
అసహనాన్ని నవ్వు వెనక దాచేస్తూంటాంలెండి.
ఎవ్వరితోను సరిగ్గా మాటలుకూడా కలపని ఈమె,
పద్మినికి మాత్రం మాటల తూటాలతో బాజాలు మ్రోగిస్తుంది.
చూడటానికి చిట్టి చేమంతిలా ఉన్నా,
సహనంలో మాత్రం భూదేవితో పోల్చవలసిందే.
ఆమె మనసు ఒక అగాధం.
చూసేవారికి లోతెంతో తెలియదు.
ఆమెలోని మౌన భాష్యానికి అర్ధం చెప్పే భాష
ఇంకా దొరకలేదు మాకు.
ఓ చిన్ని చిరునవ్వుతో అన్నిటినీ కప్పేస్తూంటుంది.
స్నేహానికి చేయూతగా, ఆకలికి అన్నపూర్ణలా వర్ధిల్లుతోంది.
ఇప్పటికీ "ప్రీతీ"అంటే మేమంతా ఇచ్చే నిర్వచనం ఒక్కటే,
"కారుణ్యపు శిలలను తనలో ఇముడ్చుకొని ఘనీభవించిన ఓ శాంతమూర్తి ఆమె".
పద్మిని :-
చూపులకి అచ్చంగా పద్మినీజాతి స్త్రీలా ఉన్నా,
మేని మలుపులలో మోహినిని తలపిస్తుంది.
ఏరంగంలో అడుగుపెట్టినా,
"పైచేయి నాదే"అంటూ దూసుకుపోయే మనస్తత్వం.
ఈమె, ఓటమినెరుగని ఓ విజయదామిని.
ఎటువంటి పరిస్థితుల్లోనైనా
"నేనున్నా"నంటూ ,అభయహస్తంతో దరిచేరుతుంది.
నాట్యంతో మయూరిగా మారి,
సంఘసేవలో దూసుకుపోయి,
చదువులో అఖండ సిఖరాగ్రాలను అందుకొని,
ఉద్యోగంలో నిశ్చల నదీప్రవాహంలా ఒదిగిపోయింది.
ఈ మోహిని మోహంలో పడ్డవారెవరూ
అంతత్వరగా బయటపడలేదు.
ఒకే వ్యక్తిలో ఐదు మనస్తత్వాలు చూడాలనుకుంటే,
ఈ మిధునాన్ని చూడవచ్చు.
మధుపానం చేస్తేనే మత్తేక్కుతుందని ఎవరు చెప్పారు?
ఈమె కళ్ళే ఓ మధిర పాత్ర (జాగ్రత్త సుమండీ...).
తేలియనివారంటూ ఆమె జాబితాలో ఉండరు.
ఎందుకంటే, ఎక్కడికెళ్ళినా అందరితో కలిసిపోతూ,అందరినీ కలిపేసుకుంటూ,
ఆడ మగ తేడాలేకుండా ఐస్కాంతమల్లే ఆకర్షిస్తుంది.
శృంగారాన్ని "రసరాజం" అని అంటారు.
మరి మా బృందావనిలోని రసరాజం "ఈమే".
శ్రీ వాత్సవి :-
చరిత్రకే మరోచరిత్ర రాసిన ఘనత ఈమెకే దక్కింది(కాదు కాదు,దక్కించుకుంది).
అందం , అమాయకత్వం కలగలిసిన ఓ తెలుగింటి మందారం,
యద్దనపూడి రచనల్లో వికసించిన నాయకుని వేణుగానానికే పరితపించే ఓ బృందావనం.
దేవుడెంత పక్షపాతో కదా!
ముత్యాల్లాంటి అక్షరాలను రాయగలిగే అవకాసం ఈమేకిచ్చి,
ఈమే నుదుటన కడగండ్ల సిలాఫలకాన్ని చెక్కాడు.
అయినా చెరగని చిరునవ్వుతో,
"నాకు నావారు ఉన్నా లేకున్నా, నావరికి నేనున్న"
అంటూ తనవారిలో కలిసిపోతుంది.
ఇదంతా నాణేనికి ఒకవైపైతే, రెండో వైపు,
ఆమె కదలికలో ఓ సెలయేరు,
వేగంలో ఓ కృష్ణజింక ,
మమకారంలో ఓ మాతృమూర్తి,
స్నేహంలో ఓ సాగరం,
మౌనంలో ఓ శిల.
నాట్యాభ్యాసానికై పరితపిస్తూ
మౌన శిలగా మారిన ఓ స్త్రీమూర్తి.
ఆనందమైనా-ఆక్రోశమైనా, కష్టాలైనా-కన్నీళ్ళయినా,
ఆ మాధవునితోనే పంచుకునే ఓ అభినవ రాధిక.
ఆమె చుట్టూ ఉన్నవారు ఆమెను
ఓ కదిలే విద్యుల్లతగా పిలుస్తారు(ఓసారి ఇలా రామ్మా మెరుపుతీగ!).
కారుచీకటిలో కొట్టుమిట్టాడుతున్న ఈ వెలుగురేఖ,
జీవతం సృష్టించిన భీభత్సాలకు,ఓ భీభత్సాన్ని సృష్టించబోతోంది.
నాగలక్ష్మి :-
కళల ఒరలో ఇమిడిన ఓ చురుకు ఖడ్గం.
ఈ కత్తికి రెండువైపులా పదునుందండోయ్ !
ఓ పక్క చుర-చురలాడే చూపులు."తేడావొస్తే, దవడ పేల్తుంది" అనేలా,
మరోపక్క ఓ ఊహించని విభిన్న కోణం "హాస్యం".
తెలియనివారికి దాదాపుగా దవడపేలగోడుతూ
తెలిసినవారికి, సరదాల పరదాల మధ్య అల్లరిని అల్లుతూ,
ఎప్పుడూ నవ్వుతూ,నవ్విస్తూ,
అప్పుడప్పుడూ చూపుల బాకులు విసురుతూ,
తనమనసులోని భావాలను వ్యక్తీకరించడం ఈమెకే సొంతమేమో!
ఈ నవరస నటనాశిరోమణి అనుకరణకి పెట్టింది పేరు.
చేసిన ఏపాత్రైనా ఓసారి సలాం కొట్టి వెళ్ళవలసిందే.
ఓ మనిషి నడకనీ,నడవడికనీ ఇట్టే పట్టేసి,
క్షణాల్లో ఆపాత్రని ఆమెలో నింపేసి,
మమ్మల్ని హాస్యంలో ముంచేస్తుంది.
ఈమెతో గడిపే ఆనందక్షణాలకు అవధులుండవు.
కళాఖండాలను అందంగా ఎవరైనా చిత్రీకరించగలరు.
కానీ కళావిహీనాల్ని కూడా ఓ కొత్త కోణంలో,
విభిన్నంగా హాస్యాన్ని జతపరుస్తూ చిత్రీకరించడం
ఈమేలోని ప్రతిభకు తార్కాణం.
ఈమెది యెంతో కళైన ముఖం.
చూపులకందని వర్చస్సు,వాక్ప్రతిభ,
సమయానుగుణంగా మారే తీరు,
ఈమెకు అమోఘ అస్త్రాలు.
నిజం చెప్పాలంటే ...............
ఈ అల్లరి బృందావనంలో అల్లరికి ఈమే ఆయువుపట్టు.
గౌతం :-
పేరుకు తగ్గట్టుగా నిజంగానే గౌతమ బుద్దుడిలాంటి వాడు.
నిత్యమూ భయ-భక్తుల మధ్య తిరుగుతూంటాడు.
చక్కని రూపు, అనువైన శరీరసౌష్టవం,
వీటిని తలదన్నే పొడవు,వీడికున్న ఆయుధాలు.
అన్నిటినీమించి ఆ నటరాజకృపాకటాక్షం వల్ల
మంచి పడగతులతో వర్ధిల్లుతున్న ఓ "సిరి సిరి మువ్వ".
నిజమైన కళారాధనకై పరితపిస్తున్న ఓ "కింకరుడు".
అమాయకత్వాన్ని ఇంటిపేరుగా చేసుకుని,
చురుకుదనాన్ని ఒంటిపేరుగా మార్చున్న వీడు,
మాతో కలిసినపుడు...............
ప్రపంచంలోని ఎనిమిదవ అద్భుతాన్ని(అవధుల్లేని ఆనందాన్ని) ఆస్వాదిస్తాడు.
మా అందరికీ అన్నయ్యైనా, తమ్ముడైన వీడే మరి !
అందుకే, అందరం ఆప్యాయంగా "తమ్ముడన్నయ్యా" అంటూ పిలుస్తూంటాం.
ప్రతిఒక్కరిది ఓ విభిన్న మనస్తత్వం.
మరి మేమంతా ఒకే ఒరలో ఎలా ఇమడగాలిగాం..........
అంత ఆలోచించవలసిన అవసరంలేదండీ, అంతా.......కృష్ణ మాయ.
ఆయన తలుచుకుంటే ఒక ఒరలో ఆరెంఖర్మ , అరవైనాలుగు కళాఖడ్గాలనూ ఇమడ్చగలరు.
ఇహ అందరూ ఓచోట చేరితే...............
అమ్మో!!...........ఆ అల్లరిని వర్ణించడానికి నాకు భాష సరిపోదే !
ఆకాశాన్ని చాపకింద చుట్టి సూరీడుతో బంతాటాడుతాం.
ఇంద్రధనుసుకి జలపాతాలబాణాన్ని ఎక్కుపెట్టి,
మొద్దుబారిన మేఘాలను గురిచూసికోడతాం.
అది నిద్రలేచి వర్షించే సమయానికి,
చిగురుటాకుల నీడలో చప్పడు చేయక దాక్కుంటాం.
"సరిలేరు మాకెవ్వరూ" అంటూ హేమంతపు తుషారాన్ని,కొండకోనలకు కట్టేస్తాం.
కాదేదీ కవితకనర్హం అన్నారు ఆనాడు.
కాదేదీ మా ఫోటోకనర్హం అన్నం మేమీనాను.
మరి మేంకలిస్తే అంతే!!
కాలాన్ని అరచేత్తో ఆపి, ఆనందాల ఆకాశానికి కొత్త నిచ్చెనలు వేస్తాం.
మేకలిసిన ప్రతిసారీ మాకు నచ్చే,మేంమెచ్చే, ఓ ఆటాదతాం.
ఏ అంత్యాక్షరినో, దొంగా-పోలీసనో అనుకోకండి.
మరేమిటా.................అనుకుంటున్నారా?
మీ ఆలోచనకు అందదులెండి.
నే చెబుతాగా.....................
మీరు ఇదివరకే గమనించారో లేదో కాని,
మా ఆరుగురిలోనూ నవరసాలూ దాగున్నాయి.
ఒక్కొక్కళ్ళు ఒక్కో రసాన్ని పిండేస్తారు(దాన్ని పట్టడం మీతరం కాదులెండి).
మొదట ఒక సన్నివేశాన్ని సృష్టించి ఇస్తుంది నాగు.
మాకు తగ్గట్టుగా ఆయా పాత్రలను అందుకొని,
పాత్రల్లో జీవించడం మొదలుపెడతాం.
అంతేనండీ.....
అడెక్కడికెళుతుందో.....ఏమవుతుందో........
మాకడుపులు చక్కలయ్యేవరకూ మాకూ తెలియదు.
కుళాయిదగ్గర నీళ్ళకోసం గొడవ మొదలుపెట్టి,
ఇంటికొచ్చిన చుట్టాల్ని కూడా ఒదిలిపెట్టకుండా,
మొగుడి అక్రమ-సంబంధాన్ని వీధిలో పెట్టే వరకు.....
ఎన్నో కడుపుబ్బానవ్వించే మాటలమూటలు విప్పుతూ,
ఆయాసపు మలుపులు తిప్పుతూ,
నవ్వుల తెప్పను తోలుతారు, మా పద్మిని,వాత్సవి.
మాటలతో హింసించే అత్తగారిని చూద్దామనుకుంటున్నారా?
వాత్సవి సిద్ధం.
కొట్టగా పెళ్ళైన కోడలి ఇరుకు ఇబ్బందులు(మొగుడితో) తెలుసు కొవాలనుకుంటున్నారా?
పద్మిని సన్నద్ధం.
టీవీ చానెల్స్ లో వ్యాఖ్యాతల్నో,టీవీ-నైన్ లో న్యూస్-రిపోర్టర్నో
కళ్ళకు కట్టేస్తుంది, నాగు.
మొగుడినా,మగాడిదైనా, ప్రతినాయకుడైనా,కోడేగాడైనా,సమరమైనా సరసమైనా,
చురుకుగా చురకలేస్తుంది, ఉమ.
బావుంది.మీరిలా చేసుకుపోతూంటే చూసేదెవరు? అని అడుగుతారా?
ఆయాపాత్రల్లో ఉంటూనే ,మిగిలన పాత్రలకు ప్రేక్షకులమౌతాం.
అయినా మాకొక నిశ్శబ్ద ప్రేక్షకురాలుందండోయ్ !
మా కారుణ్యపు స్త్రీ మూర్తి, ప్రీతి.
ఇహ గౌతముడంటారా...
సుమారుగా "మిష్టర్ పెళ్ళాం" సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం మాదిరి.
మా మాటలు తొంభైతొమ్మిది శాతం మా బృందావనం గురించే....
ఎవరూ బయటకు చెప్పకపోయినా,
ఈ వెదురు ఎప్పటికైనా వేణువుగా మారుతుందని,
కోటి రాగాలను పలికిస్తుందని,
అలుపెరుగని ఆశతో ఎదురుచూస్తూనే ఉంటారు.